
- పోడు తులకు మంత్రి సీతక్క అండగా నిలవలేదు
- సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చి మరిచారు
- మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కాగజ్ నగర్, వెలుగు: ఇక మీదట తను రాజకీయాల్లో ఇండిపెండెంట్గానే కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నెలలుగా దూరంగా ఉన్నానని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోనేరు కోనప్ప అన్నారు. 9 నెలలుగా అధికార కార్యక్రమాలకు తనను పిలవలేదని, పార్టీకి రాజీనామా ఇంకెందుకని అన్నారు. చింతలమానేపల్లి మండలం బాబా సాగర్ సమీపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ.. వచ్చే స్థానిక ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మద్దతిచ్చానని, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మీ పనులన్నీ చేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత దాని ఊసేలేదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం క్యాడర్ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోడు భూముల సాగు చేస్తున్న రైతులకు మంత్రి సీతక్క అండగా నిలవడం లేదన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్కు రాజీనామా విషయం చెప్పకుండానే పార్టీకి దూరమని ప్రకటించారు.